ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 26-28 మధ్య జర్మనీ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు జూన్ 26-27 తేదీల్లో జర్మన్ ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో జరిగే జీ7 సమ్మిట్ కోసం ష్లోస్ ఎల్మావును ప్రధాని సందర్శించనున్నారు. అనంతరం జూన్ 28న ప్రధాని మోదీ యూఏఈకి వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జర్మనీలో జరిగే జీ7 సమ్మిట్ సందర్భంగా పర్యావరణం, ఇంధనం, వాతావరణం, ఆహార భద్రత, ఆరోగ్యం, జెండర్ ఈక్వాలిటీ మరియు ప్రజాస్వామ్యం వంటి అంశాలపై రెండు సెషన్లలో ప్రధాని ప్రసంగించే అవకాశముంది.
ముఖ్యమైన సమస్యలపై అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా అర్జెంటీనా, ఇండోనేషియా, సెనెగల్ మరియు దక్షిణాఫ్రికా వంటి ఇతర ప్రజాస్వామ్య దేశాలు కూడా ఈ సమ్మిట్ కు ఆహ్వానించబడ్డాయి. ఈ సమ్మిట్ సందర్భంగా పాల్గొనే కొన్ని దేశాల నాయకులతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. మరోవైపు ఇండియా-జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ) యొక్క ఆరవ ఎడిషన్ కోసం మే 2, 2022న ప్రధాని మోదీ చివరిసారిగా జర్మనీకి వెళ్లారు.
జీ7 సమ్మిట్కు హాజరైన తర్వాత ప్రధాని మోదీ జూన్ 28న యూఏఈ చేరుకుని, యూఏఈ మాజీ అధ్యక్షుడు మరియు అబుదాబి పాలకుడు అయిన షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించినందుకు వ్యక్తిగతంగా సంతాపాన్ని వ్యక్తం చేస్తారు. అదేవిధంగా యూఏఈ యొక్క కొత్త అధ్యక్షుడిగా మరియు అబుదాబి పాలకుడిగా ఎన్నికైన షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ను కూడా ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందించనున్నారు. ఇక జూన్ 28 రాత్రి ప్రధాని మోదీ యూఏఈ నుంచి బయలుదేరి, ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY