ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పోటీచేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థి గురుమూర్తి, రాష్ట్ర మంత్రులు, కీలక వైఎస్సార్సీపీ నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 15 తేదీ సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి గురుమూర్తి తరుపున ఏప్రిల్ 14 న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బహిరంగ సభ సహా తిరుపతిలో సీఎం వైఎస్ జగన్ ప్రచార పర్యటన రూట్ మ్యాప్ కు సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ తరపున ఆయా పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారంలో పెద్దఎత్తున పాల్గొంటున్నారు. ఈ స్థానంలో ఏప్రిల్ 17 న పోలింగ్ నిర్వహించి, మే 2 వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ