ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో ఇప్పటివరకు 15 రాష్ట్రాల్లో 125 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా నియంత్రణపై పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్పై మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ అప్రమత్తమైంది. టీడీపీ కార్యాలయానికి వచ్చే నాయకులు, కార్యకర్తలందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. మార్చ్ 17, మంగళవారం నాడు పార్టీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ నేతలు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, చినరాజప్ప తదితరులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు.
అలాగే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏవైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలను పార్టీ కార్యాలయానికి రావొద్దని సూచించారు. థర్మల్ స్క్రీనింగ్ లో 100 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన వారిని పార్టీ కార్యాలయంలోకి అనుమతించకూడదని నిర్ణయించారు. పార్టీ కార్యాలయంలోకి వచ్చే ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ జరిపిన తరువాతనే పార్టీ కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కార్యాలయ సిబ్బందికి చంద్రబాబు వివరించారు.
[subscribe]