ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం కసరత్తు మొదలు పెట్టాయి. ఇప్పటికే ఈ ఎన్నికల్లో బీజేపీ- జనసేన పార్టీలు పొత్తుతో పోటీ చేయాలని నిర్ణయించుకోగా, తాజాగా టీడీపీ-సీపీఐ మధ్య కూడా పొత్తు కుదిరింది. మార్చ్ 9, సోమవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ అయ్యారు.
ఈ భేటీలో త్వరలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేసే అంశంపై చంద్రబాబు, రామకృష్ణ చర్చలు జరిపారు. సమావేశం అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో ఇరుపార్టీల పొత్తుపై స్పష్టత ఇచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ -సీపీఐ కలిసే పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని, సీట్ల సర్దుబాటుపై రెండ్రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. అన్ని జిల్లాల స్థాయిలో చర్చలు జరిపి సమన్వయంతో ఈ ఎన్నికల్లో ముందుకెళ్తామని రామకృష్ణ పేర్కొన్నారు.
[subscribe]