ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జనవరి 8, బుధవారం నాడు డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు గత 22 రోజులుగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని శాంతి భద్రతల అంశంపై కీలకంగా చర్చించినట్లు సమాచారం. అలాగే జనవరి 7న రైతులు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై జరిగిన దాడి ఘటనపై సమాచారాన్ని, పోలీసులు స్పందించిన తీరును డీజీపీ సవాంగ్ సీఎంకు వివరించినట్లు తెలుస్తుంది. రాజధానిలో రైతుల ఆందోళనలు రోజురోజుకి ఉధృతమవుతుండడంతో శాంతి భద్రతలు పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ డీజీపీకి పలు సూచనలు చేసినట్లుగా సమాచారం.
[subscribe]