ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణపై మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ విస్తరణ తర్వాత సీఎం జగన్ పై సొంత పార్టీలోనే అసమ్మతి ఉందని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. కేబినెట్ కూర్పుపై ఆ పార్టీ నేతలే బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారని, సొంత పార్టీ శ్రేణులే సీఎం దిష్టిబొమ్మలు దహనం చేయడం ఇప్పుడే చూస్తున్నామని గంటా పేర్కొన్నారు. సీఎం జగన్ సరైన విధివిధానాలు పాటించలేదని, మంత్రివర్గ విస్తరణలో అసలు కొన్ని జిల్లాలకు ప్రతినిధ్యమే లేకుండా పోయిందని గంటా తెలిపారు. ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నట్లు అన్ని ప్రాంతాలకు సమన్యాయం పాటించలేదని స్ఫష్టం చేశారు. మూడేళ్ళ వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని, త్వరలోనే టీడీపీలోకి భారీ చేరికలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ప్రజలకు కావాల్సింది సంక్షేమం ఒక్కటే కాదని, అభివృద్ధి కూడా ముఖ్యమని పాలకులు గ్రహించాలని గంటా శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ