మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ ఏ-4 దస్తగిరిని అప్రూవర్గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ భాస్కర్ రెడ్డి ఈ పిటిషన్ వేయడం గమనార్హం. కాగా దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను సిబిఐ విచారించింది. త్వరలోనే మళ్ళీ వీరిద్దరినీ విచారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దస్తగిరిని అప్రూవర్గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్లో ఇలా తెలిపారు. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా తమను ఈ కేసులో దోషులుగా చూపుతున్నారని, అయితే సీబీఐ చెప్పినట్లుగానే దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నాడని ఆరోపించారు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడని, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరేనని తెలిపారు. ప్రస్తుతం దస్తగిరి బెయిల్ పైన బయట తిరుగుతున్నాడని, నేరంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తికి బెయిల్ ఇవ్వడం సరికాదని కోర్టుకు తెలిపారు. దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు సరిగా పట్టించుకోలేదని, అతడి బెయిల్ రద్దు చేయాలని వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE