బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వలన రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం నాడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కేరళలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఐఎండీ ప్రకటించింది. అదే విధంగా కోస్తా జిల్లాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలలో గురువారం వరకు అతి భారీవర్షాలు కురిసే అవకాశముందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ప్రకటించింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాల వలన పలు పంటలకు నష్టాలు వాటిల్లాయి, మళ్ళీ మూడు రోజుల పాటు భారీ వర్ష హెచ్చరికలతో పంట నష్టంపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఉపరితల ద్రోణీ ప్రభావంతో తెలంగాణలో కూడ వర్షాలు పడుతున్నాయి. మంగళవారం నాడు పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురవగా, హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్ పల్లి, అమిర్ పేట్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, జీడిమెట్ల మరియు ఇతర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయంగా మారాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు, నగరంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటున్నారు.
[subscribe]