ఆర్టీసీ సమ్మె మీద హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అక్టోబర్ 22, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు, ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపాలని ప్రభుత్వాన్ని ఇటీవల హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. హైకోర్ట్ డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ కాపీ ఈ రోజే ప్రభుత్వానికి అందడంతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసారు. హైకోర్టు ఆదేశాలపై ఎలా స్పందించాలి, సమ్మెపై తదుపరిగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై అధికారులతో చర్చిస్తున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, సంబంధిత అధికారులతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యి రవాణా ఏర్పాట్లపై చర్చించారు. ప్రజల అవసరాల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు ఆదేశాలపై చర్చించారు, అనంతరం సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. సమ్మె రోజు రోజుకి ఉధృతం అవుతుండడంతో ఈ సమావేశంలో ప్రభుత్వం ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. సమీక్ష తరువాత మంత్రి పువ్వాడ అజయ్ మీడియా సమావేశంలో వివరాలు తెలియజేసే అవకాశం ఉంది.
[subscribe]