మంత్రి పదవి ఉన్నా లేకున్నా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోసం, వైసీపీ పార్టీ కోసం పని చేస్తానని కొడాలి నాని అన్నారు. 11వ తేదీన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం జగన్ కేబినెట్ భేటీలో చెప్పినట్లు నాని తెలిపారు. ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపేందుకు కొంతమంది సమర్ధులకు అవకాశం ఇస్తానని సీఎం చెప్పారని కొడాలి పేర్కొన్నారు. అలాగే మంత్రులుగా తొలగించబడినవారు బాధపడాల్సిన పనిలేదని, పార్టీ అవసరాలకు అనుగుణంగా వారి సేవలను వాడుకుంటామని తెలిపారన్నారు. మొత్తం 24 మంది మంత్రులం రాజీనామా లేఖలను ముఖ్యమంత్రికి అందించామని, ఒక నలుగురైదుగురు మాత్రం కేబినెట్లో కంటిన్యూ అవుతారని సీఎం తమకు చెప్పినట్లు నాని వెల్లడించారు.
అయితే తాను సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానన్నారు కొడాలి నాని. కుల సమీకరణలను పరిగణనలోకి తీసుకుని మంత్రి పదవులుండొచ్చని పేర్కొన్నారు. రాజీనామాల లేఖపై సంతకాలు చేయమని మాకందరికి సీఎం చెప్పారని, వెంటనే తామందరం రాజీనామా చేశామని నాని తెలిపారు. అయితే తమకంటే ఎక్కువగా సీఎం జగనే బాధపడ్డారని, తామంతా ఆయనకు మద్దతుగా ఉంటామని స్పష్టం చేశామని చెప్పారు. జగన్ తీసుకునే నిర్ణయాలు సామాన్యమైనవి కావని నాని అన్నారు. మంత్రుల రాజీనామా అనేది ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని, రెండున్నర సంవత్సరాల తరువాత రాజీనామాలు చేయాల్సి ఉంటుందని సీఎం జగన్ మొదట్లోనే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా మంత్రులు రాజీనామా చేసిన అనంతరం తమ సొంత వాహనాల్లో తిరిగి వెళ్లిపోయారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ