జనరేషన్ మారుతున్న కొద్దీ ఫ్యాషన్ పేరుతో బట్టల సైజు రోజురోజుకు తగ్గించేస్తున్నారు ఈ కాలం అమ్మాయిలు. సాంప్రదాయం కాదు ముఖ్యం.. కంఫర్ట్ ఇంపార్టెంట్ అంటూ పెద్దవాళ్లనూ కన్విన్స్ చేసేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఇప్పుడు నచ్చిన బట్టలు వేసుకోకపోతే.. ముసలయ్యాక వేసుకోవాలా అంటూ ఎక్స్ పోజింగ్ డ్రస్సులను వేసుకుంటూ తిరిగేస్తున్నారు. అయితే ఇదంతా ఎలా ఉన్నా..రాత్రులు మాత్రం చాలామంది నైటీలు, నైట్ డ్రస్సులు వేసుకుంటున్నారు. కంఫర్ట్ కోసం ఓకే కానీ.. కొంతమందయితే నైటీలతో డే అండ్ నైట్ గడిపేస్తుంటారు. నైటీలతోనే రోడ్డు మీదకు వెళ్లి కావాల్సిన సరుకులు కొనుక్కుంటున్నవాళ్లు కూడా బాగానే కనిపిస్తున్నారు.
ఒకప్పుడు సిటీలలో మాత్రమే కనిపించే ఈ నైటీల కల్చర్…పల్లెలు, పట్టణాలు, మహానగరాలు అనే తేడా లేకుండా మహిళలు, యువతులు నైటీలతోనే దర్శనమిస్తున్నారు. ఇంకొంతమంది అయితే సింగిల్ పీస్ నైటీలు వేసుకుని మరీ బలాదూర్గా తిరిగేస్తున్నారు. ఇలా పగలు కూడా నైటీలతో తిరుగుతున్నవాళ్లను చూసి తిక్క రేగిందో ఏమో కానీ ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరిజిల్లాలో నైటీలపై కొత్త కండిషన్లు తీసుకువచ్చారు. తెలుగువారి సాంప్రదాయం, సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు చెబుతుండటంతో.. అక్కడి అధికారులు కూడా షాక్ తిన్నారట.
ఇంతకు ముందు కూడా నైటీలు వేసుకుంటే జరీమానా అన్న వార్తలు విన్నాం కానీ..ఈ సారి ఏపీలో పశ్చిమగోదావరి జిల్లాలోనే వినిపించేసరికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ వార్త వైరల్ అయింది. పశ్చిమగోదావరి జిల్లా తోకలపల్లి గ్రామంలో మహిళలు కానీ, యువతులు కానీ పగలు నైటీలను వేసుకోవటాన్ని గ్రామపెద్దలు నిషేధించారు. ఒకవేళ నైటీ వేసుకుని కనిపిస్తే.. రెండు వేల రూపాయల జరిమానా కట్టాలని వీరంతా తీర్మానించారు. అంతేకాదు పగలు నైటీలు వేసుకుని కనిపించిన వారి గురించి చెప్పిన వారికి కూడా వెయ్యి రూపాయల బహుమానం ఇస్తామని కూడా ప్రకటించారు.
గ్రామపెద్దల తీర్మానాలు, జరీమానాలు చాలానే చూసాం కానీ నైటీలపై తీర్మానం, జరీమానా ఏంటని తోకలపల్లి మహిళలు ప్రశ్నిస్తున్నారట. చివరకు ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవడంతో ఏకంగా అధికారులే రంగంలోకి దిగారట. ఈ వింత గురించి తెలుసుకోవడానికి నిడమర్రు ఎమ్మార్వో ఎం.సుందర్రాజుతో పాటు ఎస్ఐ విజయకుమార్ తోకలపల్లిలో గ్రామంలో పర్యటించారు.
తోకలపల్లిలో నైటీలు ధరించే వారి పట్ల విధించిన జరిమానా.. ఆ గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం నిజమని తేలడంతో ఊరి పెద్దలను ఇదేం వింత తీర్మానమని ఎమ్మార్వో, ఎస్ఐ ప్రశ్నించారు. అయితే తెలుగు వారి సాంప్రదాయం, సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతోనే.. పగటిపూట మహిళలు నైటీలతో రోడ్లమీదకు తిరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామపెద్దలు వివరించారట. అంతేకాదు తమ నిర్ణయం సరైనదేనని అధికారులను కూడా కన్విన్స్ చేశారట.