ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న ఎన్నికల్లో.. అధికార పార్టీని ఇంటికి పంపించాలని ప్రతిపక్షాలు కంకణం కట్టుకుంటే.. ఏకంగా ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతయ్యేలా చేయడానికి వైసీపీ అధిష్టానం భారీ స్కెచ్లు వేస్తోంది. దీనిలో భాగంగానే 2024 ఎన్నికల్లో వైనాట్ 175 నినాదంతోనే గెలవడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం అక్టోబర్ 9వ తేదీన అంటే ఈ రోజు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో వైసీపీ నేతలతో ఏపీ సీఎం జగన్.. అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
నియోజకవర్గం నుంచి మండల స్థాయిలో ఎనిమిది వేల మంది వైసీపీ నాయకులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ఈ సభలో ప్రసంగించనున్నారు.ఈ సమావేశంలో.. పార్టీ మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వంటివారు హాజరుకానున్నారు. ఈ సమ్మిళిత మీటింగ్లో ముఖ్యమంత్రి.. తమ పార్టీ నాయకులతో సమావేశమై త్వరలో రాబోయే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి అన్న అంశాలతో పాటు.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్తున్నామన్న విషయాన్ని ఎలా తెలియజేయాలి అనే వివిధ అంశాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా..ఆంధ్రప్రదేశ్కు జగన్ కావాలి అనే నినాదంతోనే పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని వారికి సూచించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు, టీడీపీ అధినేత
చంద్రబాబు అరెస్టుతో.. జనాల్లో వేరే నెగిటివ్ సంకేతాలు వెళ్లకుండా ప్రజలకు నచ్చజెప్పటానికి నేతలంతా ముందుకు సాగాలని సీఎం జగన్ చెప్పనున్నారు. ఒకవేళ ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తే అంటూ జోరుగా సాగుతున్న ప్రచారానికి కూడా జగన్ ఫులిస్టాప్ పెట్టనున్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరు విధానంతో పాటు..జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని మాత్రమే నేతలు ప్రచారం చేయాలని సీఎం చెప్పనున్నారు.
2019 ఎన్నికల్లో సొంత కేడర్ కూడా ఊహించని విధంగా.. వైసీపీ 151 ఎమ్మెల్యే స్థానాలను గెలిచింది. కానీ ఈసారీ వైనాట్ 175 అంటూ.. అన్ని స్థానాలపై కన్నేశారు సీఎం జగన్. అందుకే టార్గెట్ 175గా పనిచేయాలని కేడర్కు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాదు దీంతో పాటే పనితీరు బాగాలేని నేతలందరికీ ఈ సమావేశంలోనే గట్టి హెచ్చరికలు పంపాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వైసీపీ సోషల్ మీడియా వింగ్, గ్రౌండ్ లెవల్ పార్టీ కార్యకర్తల పనితీరుపైన కూడా జగన్ మోహన్ రెడ్డి సమీక్షించి తగు సూచనలు చేస్తారని తెలుస్తోంది.
చంద్రబాబు అరెస్టును తమకు అనుకూలంగా మరల్చుకుని.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విక్టరీ కొట్టడమే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు. జనసేనను, టీడీపీని ఒకేసారి కోలుకోలేని విధంగా దెబ్బకొట్టడానికి శత విధాల జగన్ ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సర్వేలు కూడా అధికార పార్టీకి కాస్త ఫేవర్గా ఉండటంతో దీనినే ప్రధాన అస్త్రంగా మరల్చుకోవడానికి సీఎం జగన్ రెడీ అవుతున్నారు.