రాయలసీమ జిల్లాల పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 2, సోమవారం నాడు తిరుపతిలో చిత్తూరు, తిరుపతి లోక్సభ నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల్లో ఓడిపోయాను కానీ పడిపోలేదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వచ్చింది సిమెంట్ పరిశ్రమలు పెట్టుకోడానికి కాదని చెప్పారు. నా మతం మానవత్వం, నా కులం మాట నిలబెట్టుకోవడం అంటున్న సీఎం జగన్ మతం మారినా ఇంకా కులాన్ని ఎందుకు వదలలేదని ప్రశ్నించారు. మతం మార్చుకుంటే ఇంకా కులం ఉండకూడదని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వానిది రంగుల రాజ్యమని విమర్శించారు. రాష్ట్రంలో ఏడుకొండలు మినహా అంతటా వైసీపీ రంగులే వేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం రాజకీయాలు చేయని రోజున, రైతుల్ని ఇబ్బంది పెట్టనపుడే ఈ ముఖ్యమంత్రిని గౌరవిస్తానని, అంతవరకు జగన్ రెడ్డి అనే పిలుస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ గుండె బలానికి, ధైర్యానికి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. రాయలసీమ నుంచి ఎంతోమంది రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసినా కూడా, ఆ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
[subscribe]