ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన పార్టీ తరపున ప్రకటన విడుదల చేశారు. “ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులలో ఉద్యోగ భద్రతపై నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సుమారు 7,600 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆర్టీసీని నమ్ముకుని జీవిస్తున్నారు. ఒక నెల జీతం ఆపివేయడం, ఈ నెల 13వ తేదీన ఆర్టీసీ ఎం.డి. కార్యాలయం నుంచి విడుదలైన ఒక ఉత్తర్వు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులలో భయాందోళనకు కారణమైందని” పవన్ కళ్యాణ్ అన్నారు.
“ఈ విభాగంలోకి వచ్చే ఉద్యోగులలో జీతాలు 6000 నుంచి 15000 రూపాయల మధ్యనున్న వారే. కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న కాలంలో జీతాలు చెల్లించకపోతే వారు జీవనం ఎలా సాగిస్తారు? ఈ కష్ట కాలంలో ఉద్యోగాలు తొలగించవద్దు అని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం లేదని రవాణా శాఖ మంత్రి ఈ రోజు పత్రికా ప్రకటన చేసినప్పటికీ ఉద్యోగులలో నెలకొన్న భయాందోళనలు తొలగిపోలేదు. కరోనా ఉన్నందున, వారికి ఇన్సూరెన్స్ లేదు కాబట్టే విధులకు తీసుకోలేదని మంత్రి చెప్పడం భావ్యం కాదు. కరోనా ఎప్పుడు సమసి పోతుందో తెలియదు. అప్పటి వరకూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధులకు పిలవరా? ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తక్షణం జీతం బకాయి చెల్లించి, ఉద్యోగ భద్రత హామీని రాతపూర్వకంగా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu