కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 వరకు దేశంలో లాక్డౌన్ కఠినమైన రీతిలో అమల్లో ఉంటుందని, ఇక ఏప్రిల్ 20 తర్వాత దేశంలో వైరస్ వ్యాప్తి చెందని సురక్షిత ప్రాంతాల్లో కొంతమేర లాక్డౌన్ సడలింపు ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ మినహాయింపులలో భాగంగా కొన్ని కార్యకలాపాలపై ఆంక్షలను సడలిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్డౌన్ మినహాయింపులకు సంబంధించిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని రెడ్జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఈ ఉత్తర్వులు వర్తించవని పేర్కొన్నారు.
ఏపీలో లాక్డౌన్ మినహాయింపుల వివరాలు:
- వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు, శాస్త్రవేత్తలు, పారామెడికల్ సిబ్బంది ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ నిర్ణయం, విమాన సర్వీసులను కూడా వినియోగించుకోవచ్చని ప్రకటన.
- ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ కార్యకలాపాలు కొనసాగింపుకు నిర్ణయం.
- రహదారుల నిర్మాణం, ఇతర జల వనరుల ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతి జారీ.
- విశాఖలోని మెడ్టెక్ జోన్, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతుల యూనిట్లకు, తదితర పరిశ్రమలకు అనుమతి.
- పరిశ్రమలు, రైస్, పప్పు మిల్లులు, పిండిమరలు, డైరీ ఉత్పత్తులకు అనుమతి.
- ఔషధ తయారీ సంస్థలు, సబ్బుల తయారీ కంపెనీలు, మాస్కులు, బాడీ సూట్లు తయారీ సంస్థలకు అనుమతి.
- ఆహారోత్పత్తి పరిశ్రమలు, ఆర్వో ప్లాంట్లు, శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు.
- బేకరీ, చాక్లెట్ల తయారీ సంస్థలు, ఐస్ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అనుమతి.
- అన్నిరకాల సరుకు రవాణా వాహనాలు, రైళ్లలో సరుకు రవాణాకు అనుమతి, విమానాశ్రయాలు, పోర్టుల్లో కార్గోకు అవకాశం.
- వివిధ కంపెనీల్లో పనిచేసే కార్మికులకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలి. పరిశ్రమల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటూ, సిబ్బందికి మాస్కులు ఇచ్చి పని చేయించుకోవాలి.
- వాహనాల్లో 30శాతం మంది కార్మికులను మాత్రమే పరిశ్రమలకు తరలించాలి.
- ఈ లాక్డౌన్ సమయంలో పనిచేస్తున్నకార్మికులందరికీ వైద్యబీమా తప్పనిసరిగా ఉండాలి.
- ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల్లో 50శాతం మంది ఉద్యోగులతో విధులు నిర్వహించవచ్చు. ఐటీ హార్డ్వేర్ తయారీ సంస్థలకు అనుమతి.
- బొగ్గు ఉత్పత్తి, చమురు, గ్యాస్ ఉత్పత్తులు.
- ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన డేటా, కాల్సెంటర్లుకు మాత్రమే అనుమతి.
- రాష్ట్రంలో ఎక్కడ బహిరంగంగా పదిమంది కంటే ఎక్కువమంది గుమిగూడకుండా చూడాలి.
- రోడ్లపై గుట్కా, పాన్లు నమిలి ఉమ్మి వేయటంపై నిషేధం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu