ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇటీవలే షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. పదో తరగతిలో 11 పేపర్లను 6 పేపర్లగా కుదించి జూలై 10 వ తేదీ నుంచి పరీక్షలను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, వారికోసం 4,154 పరీక్షా కేంద్రాలు గుర్తించామని చెప్పారు. తరగతి గదిలో కేవలం 10 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అలాగే విద్యార్థుల కోసం 8 లక్షల మాస్కులు అందుబాటులో ఉంచినట్లు మంత్రి సురేష్ తెలిపారు.
కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని మంత్రి చెప్పారు. సాధ్యమైనంత వరకు ఎక్కడి వారు అక్కడే పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి పరీక్షకేంద్రం వద్ద విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మరోవైపు రెసిడెన్షియల్ విద్యార్థులకు పరీక్షలకు ఒక రోజు ముందు నుంచే హాస్టల్స్ లో వసతి సౌకర్యం కల్పిస్తామని, పరీక్షలు జరిగినన్ని రోజులు వారు వసతి గృహాల్లోనే ఉండేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని మంత్రి సురేశ్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu