వైసీపీ నేతలంతా ఒక్కొక్కరుగా కొద్ది రోజులుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటివరకూ వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో టిక్కెట్ దక్కనివారంతా తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అంతేకాదు కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి బైబై చెప్పడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
మండల స్థాయి లీడర్స్ నుంచి గ్రామ స్థాయి సర్పంచులతో పాటు బహిరంగంగానే వైసీపీ హైకమాండ్పై తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. కొంతమంది అయితే క్షేత్రస్థాయి పార్టీ కార్యకర్తలకు విలువే లేనప్పుడు పార్టీలో ఎందుకు కొనసాగాలంటూ ఇతర పార్టీలకు క్యూ కడుతున్నారు. అయినా సరే సీఎం జగన్ ఎక్కడా వెనుకడుగు వేయకుండా తన మార్కు రాజకీయాన్నే కొనసాగిస్తున్నారు. ఎంతమంది వెళ్లినా పార్టీకేమీ నష్టం లేదని మళ్లీ గెలుస్తామంటూ ధీమాను వ్యక్తం చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఇప్పటివరకూ ఏ ప్రభుత్వంలోనైనా అసెంబ్లీ నియోజకవర్గ డెవలప్మెంట్కు ఫండ్ కేటాయించడం ఆనవాయితీ. కానీ వైసీపీ సర్కారు దీనికి మంగళం పాడేసింది. ఏ ఒక్క ఎమ్మెల్యే వద్ద ఎలాంటి నిధులు లేకుండా చేసి ఒక రకంగా వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. ఈ ఐదేళ్ల నుంచి వాలంటీర్లు, సచివాలయాలు, జేసీలు, కలెక్టర్లు, పోలీసులతోనే జగన్ ప్రభుత్వాన్ని నడిపించారు.
అందుకే 2019 ఎన్నికలకు ముందు వైసీపీ జెండాలు మోసిన క్షేత్ర స్థాయి లీడర్స్ కానీ, కార్యకర్తలు కానీ పార్టీలో కనిపించడం లేదు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని పార్టీకి పునాదులుగా నిలిచిన నేతలంతా ఇప్పుడు ఎవరూ లేరు. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజునుంచే అనుసరించిన విధానాలతో ఎంతోమంది పార్టీని వీడారు. పార్టీ కార్యకర్తలను, వైసీపీ అభిమానులను వాలంటీర్లుగా ఏర్పాటు చేశాక..2019 ఎన్నికలలో గ్రామాల్లో ఓట్లు వేయించిన నేతల ప్రాధాన్యం తగ్గిపోయింది.
ఒక రకంగా చెప్పుకోవాలంటే సీఎం జగన్.. నాలుగున్నరేళ్ల పాటు ఉచిత పథకాల గురించి ఆలోచన తప్ప.. పార్టీ యంత్రాంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. 90 శాతం గ్రామ సర్పంచులను, వార్డు సభ్యులుగా ఎన్నికైన వాళ్లను, చివరకు మండలాల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలను కూడా వైసీపీ హైకమాండ్ నిర్లక్ష్యం చేసింది. గ్రామ పంచాయతీల నిధులను దారి మళ్లించడం, ప్రజాప్రతినిధులు తమ స్వంత ఖర్చులతో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో వారంతా జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
చివరకు మంత్రులు కూడా ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం, జగన్ భజన చేయడం కోసమే పరిమితం కావాల్సి వచ్చింది.కనీసం ఇలా నియోజకవర్గాల్లో తాము పట్టు కోల్పోతున్నామని తెలుసుకున్న కొంతమంది నేతలు ఇప్పటికే టీడీపీ, జనసేన,కాంగ్రెస్ పార్టీలలోకి వెళ్లిపోయారు. అంతేకాదు ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మరో 30 మంది దాకా పార్టీ వీడే అవకాశాలున్నట్లు వైసీపీ వర్గాల నుంచే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY