ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలలో సుదీర్ఘ చర్చ అనంతరం 3 రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు, ఇతర అంశాలపై హైకోర్టులో పలు పిటిషన్స్ దాఖలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో రాజధానిపై నమోదైన పిటిషన్లను వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించుకుంది. ఇందుకు గానూ ఆయనకు ఫీజు కింద రూ.5 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీచేసింది. ముందుగా అడ్వాన్స్ కింద ఆయనకు రూ.కోటి చెల్లించేందుకు అనుమతిస్తూ జనవరి 22, బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని అంశానికి సంబంధించి గ్రామాల్లో 144 సెక్షన్ కేసు, మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దుతో పాటు ఇతర అంశాలపై హైకోర్టులో నమోదయిన కేసుల విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున ఇకపై ముకుల్ రోహత్గీ వాదించనున్నారు.
[subscribe]