తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, అచ్చెన్నాయుడు అన్న కొడుకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడిని ఇప్పుడు రెండు నియోజకవర్గాలు కలవరపెడుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.వారిద్దరూ పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో టెన్షన్ ఉండటం ఎన్నికలలో మామూలే అని అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే బాబాయ్, అబ్బాయిలను టెన్షన్ పెడుతోన్న ఆ రెండు నియోజకవర్గాలలో వాళ్లు ఇప్పుడు పోటీ చేయడం లేదు.
కాకపోతే ఈ రెండు నియోజకవర్గాలు.. వారిద్దరూ ఏరి కోరి అభ్యర్థులను మార్చిన నియోజకవర్గాలు. అందుకే అక్కడ పార్టీ విజయం ఇప్పుడు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులను వెంటాడుతున్నాయి. స్వంత నియోజకవర్గమైన టెక్కలిలో అచ్చెన్నాయుడుకు పెద్దగా పోటీ లేదు.. ఇతర ఇబ్బందులు కూడా పెద్దగా ఇబ్బందులేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే వైఎస్సార్సీపీ గ్రూపు గొడవలు, అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాలు అచ్చెన్నాయుడు విజయాన్ని మరింత తేలిక చేశాయి. అయితే శ్రీకాకుళం, పాతపట్నంలో పాత వారిని పక్కన పెట్టి మరీ కొత్త వారికి అవకాశం కల్పించడంతో.. ఈ రెండే ఇప్పుడు వీరిద్దరికీ సవాల్ విసురుతున్నాయి.
శ్రీకాకుళం సీటును బాబాయ్, అబ్బాయిలిద్దరూ కలిసి.. కొత్త అభ్యర్థి గొండు శంకర్కు ఇప్పించారు. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబాన్ని కాదని మరీ..ఇప్పుడు కొత్త అభ్యర్థి గోండు శంకర్కు అవకాశం కల్పించడమే అక్కడ పెద్ద సమస్యగా మారింది. 2014 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావుపై గెలిచిన గుండ లక్ష్మీదేవిని పక్కన పెట్టి.. యువనేతకు అవకాశం కల్పించడంతో గుండ వర్గం నుంచి శ్రీకాకుళంలో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. రాజకీయాల్లో కాకలు తీరిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావును గొండు శంకర్ ఢీకొనడంతో..అతన్ని గెలిపించాల్సిన బాధ్యతను టికెట్ ఇప్పించిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు భుజాలపై పడింది. నియోజకవర్గంపై మంచి పట్టున్న సూర్యనారాయణ కుటుంబం సహకరించకపోవడంతో.. ఇక్కడ శంకర్ ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
మరోవైపు పాతపట్నం రాజకీయాలలోనూ అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వేలు పెట్టారు. అక్కడ రాజకీయాలను ఎప్పటి నుంచో శాసిస్తున్న కలమట కుటుంబాన్ని పక్కన పెట్టి మరీ కొత్త అభ్యర్థి మామిడి గోవిందరావుకు టికెట్ ఇప్పించారు. దీంతో టీడీపీ అసమ్మతి నేతలు పెరిగిపోవడంతో వాళ్లను బుజ్జగించడానికే తల ప్రాణం తోకకు వస్తుందట ఈ ఇద్దరికి.
గత రెండు ఎన్నికల్లోనూ పాతపట్నం సీటును వైఎస్సార్సీపీనే దక్కించుకొంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన కలమట వెంటకరమణ మూర్తి ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019లో ఆయన టీడీపీ అభ్యర్దిగా వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి చేతిలో ఓడిపోయారు. అటువంటి నియోజకవర్గంలో కొత్తవాళ్లలను రంగంలోకి దించి అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు కొత్త సవాల్ను తలమీద పెట్టుకున్నారన్న టాక్ నడుస్తోంది. ఎంపీగా రామ్మోహన్నాయుడు గెలవాలన్నా కూడా ఈ రెండు అసెంబ్లీ స్దానాలే కీలకంగా మారనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY