జనవరి చివరి వారం నుంచి కార్యకర్తలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహించనున్నారు. జనవరి 17, శుక్రవారం నాడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు టి. శివ శంకర్, బొలిశెట్టి సత్య, పార్టీ ఉపాధ్యక్షులు బి. మహేందర్ రెడ్డి, రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీతో పొత్తు, త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా క్రియాశీల కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా పవన్కల్యాణ్ ఆదేశించారు. రానున్న నాలుగు వారాలలో చేపట్టాల్సిన కార్యక్రమాల ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీకోసం కష్టపడేవారి జాబితాలతో పాటుగా, తమ తమ వృత్తులు, ఉద్యోగాలు కొనసాగిస్తూ పార్టీ కోసం పనిచేస్తున్న వారి జాబితాను తయారు చేయాలని స్పష్టం చేశారు.
బీజేపీతో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై కార్యకర్తల సమావేశాల్లో చర్చించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలను గుర్తించి వారిని ఆదరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జాతీయ, ప్రాంతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలు, పబ్లిక్ పాలసీస్, పార్టీ ఆలోచనా విధానం, వర్తమాన రాజకీయాలుపై ఎంపిక చేసిన కార్యకర్తలకు వర్క్ షాప్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలనీ సూచించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన యువ అభ్యర్థులతో కూడా సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్టీలో ఉంటూ సామాజిక సేవ చేయాలన్న ఆలోచనతో ఉన్నవారితో ఒక సేవాదళ్ను రూపొందించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
[subscribe]