గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన వైసీపీ బాధిత పునరావాస శిబిరంలో ఉన్న వ్యక్తులను వారి సొంత ఊర్లకు తీసుకెళ్లేందుకు తాము సిద్ధమని పోలీసులు ముందుకు వచ్చారు. టీడీపీ పార్టీ రేపు చలో ఆత్మకూరు ప్రకటించిన నేపథ్యంలో శిబిరానికి చేరుకున్న గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ చక్రవర్తి బృందం అక్కడ ఉన్న టీడీపీ నాయకులతో చర్చలు జరిపింది. అయితే పోలీసులపై తమకు నమ్మకం కుదరడం లేదని, పార్టీ అధినేత చంద్రబాబు శిబిరానికి వచ్చాక ఆయనతో చర్చించి నిర్ణయం తెలుపుతామని టీడీపీ నాయకులు పోలీసులకు వెల్లడించారు. బాధితులను సురక్షితంగా వాహనాల్లో వారి ప్రదేశాలకు చేర్చడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, వాళ్లే ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఎస్పీ చక్రవర్తి తెలిపారు.
మరోవైపు టీడీపీ సీనియర్ నాయకులు చంద్రబాబు తో సమావేశమయ్యారు. బాధితుల తరలింపు, చలో ఆత్మకూరు వంటి పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. గుంటూరులో వైసీపీ బాధితుల శిబిరం పెట్టి 8 రోజులవుతుందని, వేలాది మంది బాధితులు 100 రోజుల నుంచి వారి గ్రామాలకు దూరంగా ఉంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కావడం, బాధితులకు న్యాయం జరగడమే టీడీపీ పార్టీ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. కేవలం పల్నాడు ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో శాంతి భద్రతల సమస్య ఉందని, టీడీపీ కార్యకర్తలపై వేధింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. అదనపు ఎస్పీ స్థాయిలో ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం జరగాలని, వారిపై నమోదు చేసిన తప్పుడు కేసులు ఎత్తేసేవరకు టీడీపీ పార్టీ వారికీ అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.
[subscribe]
[youtube_video videoid=2tkzdzVKsVk]