ఆంధ్ర భూతల స్వర్గంగా పేరుగాంచిన అరకు ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరం. చలి కాలంలో అరకు అందాలు చూడటం ఓ అద్భుత అనుభూతి. ఒక్కసారి చూస్తేచాలు.. మళ్ళీ మళ్ళీ వెళ్లాలనిపించేలా ఉంటుంది అక్కడి ప్రకృతి సోయగం. ఏపీ టూరిజం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెడుతుంటుంది. అరకు అందాల ఆస్వాదనకు వచ్చే వీక్షకులకు అక్కడ సకల వసతులు లభిస్తాయి. రోడ్డు మార్గం కానీ, రైలు మార్గం కానీ.. దారిపొడవునా ప్రకృతి కనువిందు చేస్తూ ఉంటుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ మరో లోకంలోకి తీసుకెళ్తుంది. న్యూ ఇయర్ రోజున అక్కడకు వెళ్ళటం చాలామందికి అలవాటు.
అయితే ఇప్పుడు అరకుపై కరోనా ఎఫెక్ట్ పడింది. అరకులో నిర్వహించే వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ కొత్త సంవత్సరం వేడుకలపై నీళ్లు చల్లుతోంది. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వడం లేదు. ఇప్పటికే అరకుకు భారీ ఎత్తున పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. న్యూ ఇయర్ వేడుకల కోసం రిసార్ట్స్, హోటళ్లలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పర్యాటకులు కేరింతలు కొట్టడానికి ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అరకు సహా పర్యాటక ప్రాంతాలపై నిఘా పెంచుతున్నాం.. అదనపు బలగాలతో పహారా ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ కృష్ణారావు చెప్పారు. అలాగే హైస్పీడ్ రైడింగ్, బహిరంగ మద్యం, జూదంపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. రేవ్ పార్టీల నిర్వహణ, గంజాయి వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పర్యాటక ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు ఉపేక్షించేదిలేదని పోలీసులు తేల్చి చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై ఇప్పటికే హోటల్స్, రిసార్ట్స్, జీప్ యజమానులకు ప్రత్యేక సూచనలు ఇచ్చామని పాడేరు ఏఎస్పీ జగదీష్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ