భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు. ముందుగా సోమవారం ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న అనంతరం, ప్రత్యేక హెలికాఫ్టర్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సున్నిపెంట హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో రాష్ట్రపతి శ్రీశైలంకు చేరుకున్నారు. ముందుగా శ్రీశైలంలో సాక్షి గణపతి ఆలయాన్ని రాష్ట్రపతి సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ తర్వాత శ్రీశైలం ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి ఏపీ మంత్రి ఆర్కే రోజా, ఎంపీ బ్రహ్మానందరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఆలయం లోపలికి ఆహ్వానించారు. అనంతరం మల్లికార్జున స్వామి వారిని మరియు భ్రమరాంబ దేవి అమ్మవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో రాష్ట్రపతికి అర్చకులు వేద ఆశీర్వచనాలు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి వెంట తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రులు కూడా ఉన్నారు.
ఆతర్వాత కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క ప్రసాద్ పథకం కింద శ్రీశైలం ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను రాష్ట్రపతి ప్రారంభించారు. అలాగే శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్పూర్తి కేంద్రాన్ని కూడా రాష్ట్రపతి సందర్శించారు. ఇక శ్రీశైలం పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ లోని హకీంపేట ఎయిర్బేస్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఘనస్వాగతం పలికారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE