బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 17, 2023) నుంచి భారత్, ఆస్టేలియా మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. నాగ్పూర్లో జరిగిన తొలి టెస్టులో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీకి ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అర్ధ సెంచరీలు చేయడంతో భారీ స్కోరు సాధించిన టీమిండియా.. బౌలింగ్ లో తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా, రెండో ఇన్నింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ లు 5 వికెట్ల ప్రదర్శన చేయడంతో కేవలం రెండున్నర రోజుల్లోనే ముగించి ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రెండో టెస్టులో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అలాగే రేపటి మ్యాచ్ కోసం భారత్ పెద్దగా మార్పులు లేకుండానే తొలి టెస్టులో ఆడిన జట్టుతోనే ఆడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక స్టార్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారాకు ఇది 100వ టెస్టు కావడం విశేషం. దీంతో అతడు రేపు సెంచరీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే మరోవైపు గాయం కారణంగా నాగ్పూర్లో జరిగిన తొలి టెస్టుకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శ్రేయాస్ విజయవంతంగా పునరావాసం పూర్తి చేసుకోవడంతో ఢిల్లీ టెస్టులో ఆడేందుకు అనుమతి బీసీసీఐ మెడికల్ టీం అనుమతి ఇచ్చింది. దీంతో రేపటి మ్యాచ్ కు తుది జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రేయాస్ అయ్యర్ కనుక తుది జట్టులో స్థానం సంపాదించుకుంటే సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్లలో ఎవరో ఒకరు తప్పుకోవాల్సి ఉంటుంది. భరత్ కనుక తప్పుకుంటే అప్పుడు కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.
ఇక ఇదిలాఉండగా తొలి టెస్టులో ఇన్నింగ్స్ పరాజయంతో భారీ షాక్ తగిలిన ఆస్ట్రేలియా ఎలాగైనా రేపటి మ్యాచ్ లో గెలవాలని గట్టి పట్టుదలగా ఉంది. భారత స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబాటుకు లోనవడం ఆ జట్టును తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆ జట్టు టాప్ ఆటగాళ్ళైన స్టీవ్ స్మిత్, వార్నర్ సహా అందరూ విఫలమయ్యారు. అయితే పాట్ కమిన్స్ సారధ్యంలోని ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకోవడంతో పాటు ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దీంతో రెండో టెస్టులో గెలవడం ద్వారా సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు జరుగనున్న మ్యాచ్ హోరాహోరీగా సాగనుందని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.
జట్లు అంచనా..
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), అష్టన్ అగర్, మార్నస్ లబుషేన్, డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, పీటర్ హ్యాండ్కాంబ్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, నాథన్ లియోన్, మిచెల్ స్టార్క్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE