కొద్దిరోజులుగా చంద్రబాబు నాయుడు వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వెంట వెంటనే ఆయనపై కేసులు నమోదు చేస్తూ ఊపిరాడనివ్వకుంటా చేస్తున్నారు. 52 రోజుల పాటు జైలు జీవితం గడిపిన చంద్రబాబు ఇటీవలే మధ్యంతర బెయిల్పై బయటకొచ్చారు. అయితే ముందు నుంచి కూడా కొందరు నేతలు.. చంద్రబాబును కావాలనే అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అటు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురందేశ్వరి కూడా చంద్రబాబుపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. వైసీపీ సర్కార్ను నిలదీశారు.
అయితే ఆమెకు తెలియకుండానే.. చంద్రబాబు వరుస కేసుల్లో ఇరుక్కోవడానికి పురందేశ్వరి కారణం అయ్యారు. ఆ విషయం అర్థమయ్యేలోపే.. చంద్రబాబుపై ఎన్నికేసులు పెట్టొచ్చో అన్ని కేసులు పెట్టేశారు. కొద్దిరోజుల క్రితం ఇసుక కుంభకోణంపై వైసీపీ ప్రభుత్వాన్ని పురందేశ్వరి ప్రశ్నించారు. ఆ వెంటనే ఇసుక కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉందని కేసు నమోదు చేశారు. అంతకంటే ముందు లిక్కర్కు సంబంధించి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రాకుండా.. కొందరు వైసీపీ నేతలు గండికొడుతున్నారని ఆరోపించారు. ఆ నిలదీసిన రెండు రోజులకే చంద్రబాబుపై లిక్కర్ స్కామ్ కేసు పెట్టారు. ఆ స్కామ్లో చంద్రబాబును ఏ3గా పేర్కొన్నారు.
ముందు నుంచి కూడా లిక్కర్, ఇసుక కుంభకోణాల్లో టీడీపీ పాత్ర ఉందని నింద ఉంది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లకు పైగా అవుతున్నప్పటికీ.. ఎప్పుడూ వీటి గురించి పట్టించుకోలేదు. అటు పోలీసులు కూడా ఎవరినీ అరెస్ట్ చేయలేదు. సరిగ్గా పురందేశ్వరి ప్రశ్నించిన వెంటనే చంద్రబాబుపై కేసులు పెట్టారు.
ఇలా కేసులు పెట్టడంపై పురందేశ్వరి స్పందిస్తూ.. వైసీపీ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్, ఇసుక కుంభకోణాలపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. ఇతరులపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పూర్తిగా నిరంకుశ పాలన నడుస్తోందని మండిపడ్డారు. తాము లేవనెత్తిన అంశాలపై జవాబు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. ఆ రెండు కుంభకోణాలపై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి కూడా పురందేశ్వరి స్పందించారు. పొత్తులు ఎప్పుడూ ఎన్నికలకు ఒకటి, రెండు నెలల ముందే కుదురుతాయని వ్యాఖ్యానించారు. అయినా పొత్తు అంశం తమ చేతిలో లేదని.. ఢిల్లీ పెద్దలు తేల్చాల్సిన అంశమని అన్నారు. అయితే పురందేశ్వరికి మాత్రం వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఉందని వాదన వినిపిస్తోంది. మరి ఢిల్లీ పెద్దలు దీనికి అంగీకరిస్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE