మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి అలియాస్ తుమ్మలపల్లి గంగిరెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఇటీవలే ఆయన బెయిల్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా మే 5వ తేదీ లోపు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయేందుకు గంగిరెడ్డి ఈరోజు ఉదయమే సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. ఇక వివేకా హత్య కేసులో ఏ-1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని ఏపీ పోలీసులు 2019 మార్చి 28న అరెస్టు చేశారు. అయితే ఆ తర్వాత 90 రోజులు గడచినా చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో, అదే ఏడాది జూన్ 27న డీఫాల్ట్ బెయిల్ వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఎంటర్ అయ్యారు. తన తండ్రి హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు సీబీఐకి అప్పగించింది.
ఈ క్రమంలో గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు కొట్టివేసింది. దీంతో సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా.. తీవ్ర నేరారోపణలు ఉన్న కేసుల్లో స్పష్టమైన ఆధారాలు ఉంటే డీఫాల్ట్ బెయిల్ను రద్దు చేయొచ్చని పేర్కొంటూ, సీబీఐ పిటిషన్పై మెరిట్ ఆధారంగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీం కేసును ఏపీ హైకోర్టుకు సూచించింది. ఇక ఈ తరుణంలోనే వివేకా హత్య కేసు దర్యాప్తు తెలంగాణకు బదిలీ అవగా.. తెలంగాణ హైకోర్టు గత నెల 27న రద్దు చేసింది. అలాగే గంగిరెడ్డిని ఈనెల 5వ తేదీలోపు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో గంగిరెడ్డి నేడు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో లొంగిపోయారు. న్యాయస్థానం జూన్ 2వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని చంచల్ గూడ జైలుకు తరలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE