ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు ఈ కేసులో గత కొన్ని నెలలుగా రిమాండ్లో ఉంటున్న విషయం తెలిసిందే. మే 19వ తేదీన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరుగగా.. పలు ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టిన అనంతరం, మే 23న అనంతబాబు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అప్పటినుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన పలుసార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రాజమండ్రిలోని ఎస్సీ ఎస్టీ కోర్టు సహా ఏపీ హైకోర్టు కొట్టివేశాయి.
ఈ నేపథ్యంలో అనంతబాబు బెయిల్ కోసం చివరిగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో నేడు ఈ పిటీషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేసి 90 రోజులు దాటిపోయిందని, కావున డిఫాల్ట్ బెయిల్ పొందేందుకు ఆయన అర్హుడని ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఆగస్టు 26న ట్రయల్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా అనంతబాబుకి మరో 15 రోజులు పాటు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించాలని పోలీసులు కోరారని తెలిపారు. ఈలోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి చార్జిషీట్ దాఖలు చేయలేదని కూడా వారు సుప్రీంకు వెల్లడించారు. వారి వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం అనంతబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా బెయిల్ షరతులను కింది కోర్టు విధిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE