రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీకి కోసం సేకరించిన భూములపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై మార్చ్ 23, సోమవారం నాడు ఏపీ హైకోర్టు స్టే విధించింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు నుంచి సమీకరించిన భూములలో వేరే ప్రాంతాల వారికీ భూములివ్వకూడదని, రాజధాని గ్రామాల్లోని పేదలకు మాత్రమే భూములివ్వాలని ఆప్రాంత రైతుల తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వ జీవోపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అర్హులైన పేదలందరికీ ఇళ్లు స్థలాలు పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా పంపిణీ కోసం రాజధాని అమరావతి పరిధిలోని పలు గ్రామాల్లో భూములను సేకరించింది. సీఆర్డీఏ పరిధిలోని తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాలలోని కొన్ని గ్రామాలతో పాటుగా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్లో కూడా భూములు సేకరించారు. మొత్తం 54,307మంది లబ్ధిదారులకు 1251.5 ఎకరాలు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అర్హులైన పేదలకు ఈ భూముల్లో ఇళ్ల స్థలాల పంపిణీ చేయబోతున్నట్టు జీవోను విడుదల చేశారు.