కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై మార్చ్ 18, బుధవారం నాడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ధర్మాసనం సమర్ధించింది.
ఎన్నికలు నిర్వహణ అంశంలో రాష్ట్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఎన్నికలపై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాష్ట్రంలో ఎన్నిక కోడ్ ఎత్తివేయాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తన నియమావళిని రద్దు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో కొత్త పథకాలు ప్రవేశపెట్టొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ ఏవైనా కొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలుచేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కోర్టు సూచించింది. అలాగే ఇప్పటికే ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగించవచ్చునని కోర్టు స్పష్టం చేసింది.
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
స్థానిక ఎన్నికలు వాయిదాపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం
[subscribe]