ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో ఆందోళనకారులు చేపట్టిన నిరసన కార్యక్రమాలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దాంతో భద్రతా కారణాల దృష్ట్యా కోనసీమ జిల్లాలోని అమలాపురం సహా పలు ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. ఇంటర్ నెట్ సేవల నిలిపివేతతో జిల్లాలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు ఇబ్బంది పడుతుండగా, ఇతర డిజిటల్ లావాదేవీలకు విఘాతం ఏర్పడింది. తాజాగా ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, కోనసీమలో ఇంటర్నెట్ సేవలు వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
“కోనసీమలో వారం రోజులైనా ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించలేక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. ఎక్కడో కాశ్మీర్ లో వినిపించే ‘ఇంటర్నెట్ సేవలు నిలిపివేత’ అనే వార్త ను మన సీమలో వినాల్సి రావడం బాధాకరం. ఐటీ వంటి ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం, కనీసం వాళ్ళు పని చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా చెయ్యడం దారుణం. ఇంటర్ నెట్ అనేది ఇప్పుడు అతి సామాన్యుడి జీవితంలో కూడా భాగం అయ్యిందన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలి. చిరు వ్యాపారుల లావాదేవీలు కూడా నెట్ ఆధారంగా నడిచే రోజుల్లో వారం రోజులు సేవలు నిలిపివేయడం సరికాదు. వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నా. ఇది లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయం. మీ ఉదాసీనత వారికి ఇబ్బందిగా మారకూడదు” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF