భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా జనవరి 24, శుక్రవారం నాడు జరిగిన తోలి టీ20లో ఆరు వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లకే భారత్ చేధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ(7) పరుగులకే అవుట్ అవ్వగా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(56: 27 బంతుల్లో 4×4, 3×6), కెప్టెన్ విరాట్ కోహ్లి(45: 32 బంతుల్లో 3×4, 1×6) రాణించి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్కు 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పారు. స్వల్ప వ్యవధిలోనే రాహుల్, కోహ్లీ ఔట్ అవ్వగా శ్రేయస్ అయ్యర్(58 నాటౌట్: 29 బంతుల్లో 5×4, 3×6) పరుగులతో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడడంతో భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని సాధించింది. శివమ్ దూబే (13), మనీశ్ పాండే(14) పరుగులు చేశారు. ఐష్ సోది రెండు వికెట్లు పడగొట్టగా, సాంట్నార్, బ్లెయిర్ టిక్నర్ చెరో వికెట్ పడగొట్టారు.
ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (30), కొలిన్ మన్రో (59) పరుగులతో జట్టుకు శుభారంభాన్ని అందించగా, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51), రాస్టేలర్ (54*) పరుగులతో చెలరేగి ఆడారు. భారత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ బౌండరీలు, సిక్సర్లతో కేన్ విలియమ్సన్, రాస్టేలర్ మరోసారి సత్తా చాటారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, చహల్, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీశారు. ఇక ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జనవరి 26న జరగనుంది.