ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికలలో ఎదురైన ఓటమి తెలుగు దేశం పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో రానున్న ఎన్నికలలో తిరిగి అధికారంలోకి రావాలంటే ప్రజలలో ఆ పార్టీ మళ్ళీ పట్టు సాధించాల్సి ఉంది. దీనికోసం ఇప్పటినుంచే ఒక ప్రణాళిక మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనిలో భాగంగా.. మే నెల 4వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మొదటగా ఉత్తరాంధ్ర జిల్లాలను ఆయన సందర్శించనున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలపై అధిక చార్జీలను మోపుతోందంటూ, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో ‘బాదుడే బాదుడు’ పేరుతో గత కొన్ని రోజులుగా ఒక నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు, తద్వారా పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు చంద్రబాబు నాయుడు పూనుకుంటున్నారు. తొలుత మే 4వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం పరిధిలోని దల్లావలస గ్రామంలో పర్యటించనున్నారు. అలాగే 5వ తేదీన విశాఖ జిల్లా భీమిలి నియోజవర్గం పరిధిలోని తాళ్లవలస గ్రామంలో, 6వ తేదీన గోదావరి జిల్లాల పరిధిలో ముమ్మడివరం నియోజవర్గం, కోరింగ గ్రామంలో జరిగే ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమాలలో పాల్గొననున్నారు. మే చివరి వారంలో జరుగనున్న ‘మహానాడు’ కార్యక్రమం వరకు వివిధ జిల్లాలలో పర్యటించనున్నారు చంద్రబాబు. తద్వారా పార్టీ శ్రేణులలో, నాయకులలో ఉత్సాహాన్ని నింపాలని, అదే ఊపు మహానాడు వేదికగా ప్రతిబింబించాలని భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ