మే 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీ రామారావు వరంగల్ పర్యటనకు రానున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన ఖరారు, ఏర్పాట్లపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మా రెడ్డి, అరూరి రమేశ్, కుడా చైర్మన్ సుందర్ రాజు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, వరంగల్ మహానగర కమిషనర్, సీపీ, ఇతర అధికారులతో సమావేశమై చర్చించారు.
మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా, కైటెక్స్ మెగా టెక్స్టైల్ పార్క్ కు శంకుస్థాపన, భూమి పూజ చేయనున్నారు. అలాగే గణేష్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ ను ప్రారంభించనున్నారు. ముందుగా మంత్రి కేటీఆర్ హనుమకొండలోని పీజేఆర్ గార్డెన్స్ లో ఐటీ ప్రొఫెషనల్స్ తో ఇంటరాక్షన్ అవుతారు. ఈ సందర్భంగా ఐటీ రంగం, ఐటీ కంపెనీల విస్తరణ, అవకాశాలు, ఉపాధి వంటి పలు అంశాల పై కేటీఆర్ వారితో చర్చించనున్నారు. అలాగే నయీంనగర్ లో గల సాప్ట్ పాత్ ఐటీ ఆఫీస్ సందర్శించే అవకాశం ఉంది.
అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం అవుతారు. ఈ సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై వారితో చర్చిస్తారు. అలాగే ప్రజా ప్రతినిధులతో కలిసి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. కాగా ఆరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హనుమకొండకు చేరుకుని, కార్యక్రమాలను ముగించుకొని తిరిగి హెలికాప్టర్ ద్వారానే హైదరాబాద్ చేరుకుంటారని తెలిపారు. మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు తగు ఏర్పాట్లను చేసి సంసిద్ధంగా ఉండాల్సింది గా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ