గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం రెండో రోజు కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గురువారం మొదటి రోజు నిన్న కోనసీమ లోని పలు మండలాల్లో పర్యటించారు. నిన్న రాత్రి పాలకొల్లులో బస చేసిన చంద్రబాబు శుక్రవారం ఉదయం 10 గంటలకు యలమంచిలి మండలంలోని దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగాధర పాలెం, లక్ష్మీపురం ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం ఇచ్చే రూ. 2 వేలు ఏమాత్రం సరిపోవని, కనీసం రూ. 10 వేలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అనేక ప్రాంతాలలో ముంపు బాధితులు తమ ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. పలువురు మహిళలు, వృద్దులు ఆయనను కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వారందరికీ ధైర్యం చెప్తూ, ప్రభుత్వాన్ని నిలదీసి వరద సాయం అందేలా చేస్తానని హామీ ఇస్తూ ఆయన ముందుకు సాగారు. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తయినట్లైతే గోదావరికి ఇంత భారీ వరద వచ్చేది కాదని, ఇన్ని గ్రామాలు ముంపుకి గురయ్యేవి కావని అన్నారు.
పర్యటనలో చివరిగా చంద్రబాబు నరసాపురం మండలం పొన్నపల్లి వద్ద గోదావరి గట్టును సందర్శించారు. అనంతరం రోడ్డు మార్గంలో ఆయన రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వెళ్లి రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. కాగా నిన్నటి పర్యటనలో చంద్రబాబు బోటు ప్రమాదం నుంచి బయటపడటం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు బోటులో ప్రయాణిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమ, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులంతా నదిలో పడిపోగా, ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన మత్స్యకారులు టీడీపీ నేతలను నదిలో నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ