నచ్చని అభ్యర్థి పోస్టర్లను చింపేయడం.. బురద జల్లడం వంటివి ఇటీవలి ఎన్నికల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే అసలు పోస్టర్లే వేయడం లేదు కాబట్టి. గతంలో ఎన్నికలు అంటే ఏ వీధి చూసినా.. ఏ గోడ చూసినా వాల్ పోస్టర్లే కనిపించేవి. ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాకుండా, అభ్యర్థులంతా వాల్ పోస్టర్లనే విస్తృత ప్రచారానికి ఎంచుకునేవారు. కొన్ని సందర్భాల్లో తమ పోస్టర్పై ఏవిధంగా మరో పోస్టర్ వేస్తారని, పోస్టర్ చించారని నాయకులు, కార్యకర్తల మధ్య వివాదాలూ జరిగేవి.
డిజిటల్ యుగంలో నగరాల్లో ఎన్నికల పోస్టర్లే లేవు. తాను అభ్యర్థినంటూ, తనకు ఓటు వేసి గెలిపించాలి అంటూ పోస్టర్లు వేయలేదు. వీధులు, ప్రధాన రోడ్లలో ఆయా పార్టీల అభ్యర్థుల పోస్టర్లే కనిపిస్తలేవు. అక్కడక్కడ డోర్ స్టిక్కర్లు కనిపిస్తున్నాయి. అదీ కూడా ఒకటి, రెండు అర మాత్రమే. ప్రస్తుతం ఎన్నికల ప్రచారమంతా డిజిటల్లోనే సాగుతున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులు తమకు ఓటు వేయాలంటూ వినూత్న రీతిలో డిజిటల్ పోస్టర్లు, వీడియోలను తయారు చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో పోస్టర్లు, స్టిక్కర్లు, కరపత్రాలను ముద్రించే ప్రింటింగ్ ప్రెస్లు కునారిల్లాయి. 2017 కంటే ముందు ఎన్నికల వేళ తీరిక లేకుండా ప్రింటింగ్ ప్రెస్లు పని చేసేవి. దాదాపు రెండు నెలల పాటు ప్రింటింగ్ ప్రెస్లకు చేతినిండా పనులుండేవి. ఇక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పోలింగ్ వరకు ప్రింటింగ్ ప్రెస్లలో పెద్దఎత్తున ప్రచార సామగ్రి ముద్రించే వారు. డిజిటల్ ప్రచారం వచ్చిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్లలో పది రోజుల పని దొరకడమే గగనంగా మారింది.
మరోవైపు ఆంక్షలు సైతం ప్రింటింగ్ ప్రెస్లపై ప్రభావం చూపాయి. కరపత్రాలు, డోర్ స్టిక్కర్లు, వాల్ పోస్టర్లు, ఇతర ప్రచార సావగ్రిర ముద్రణపై ఎన్నికల కమిషన్ పలు ఆంక్షలు విధించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు ప్రింటింగ్ ప్రెస్ల నిర్వహకులతో సమావేశం జరిపారు. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులకు సంబంధించిన ప్రచార సామాగ్రి పూర్తిగా ఎన్నికల వ్యయంలోనికి వస్తుందని, కరపత్రాలు వేసినా, డోర్ స్టిక్కర్లు, వాల్ పోస్టర్లు ముద్రించిన కానీ ఎంత ముద్రించారో సంఖ్యను దానిపై ప్రచురించాలని నిబంధనలు విధించారు. నిరంతరం వివిధ ప్రాంతాల వారిగా తిరిగే వీడియో సర్వేలైన్స్ పోస్టర్లను గుర్తించి లెక్కిస్తాయని, పోస్టర్లపై ముద్రించిన సంఖ్య కంటే అధికంగా ఉంటే ప్రింటింగ్ ప్రెస్లను సీజ్ చేస్తామని హెచ్చరించాయి. దాంతో పాటు వాల్ పోస్టర్లు కానీ, డోర్ స్టిక్కర్లను ప్రభుత్వ కార్యాలయాలు, వాటికి సంబంధించిన ప్రహరీలు, బస్టాప్లపై ఎన్నికల అభ్యర్థులు పోస్టర్లను అంటించొద్దనే నిబంధనలున్నాయి. దీంతో అభ్యర్థులు వాల్ పోస్టర్లు వేయడం లేదు.
ప్రపంచ స్థాయి సంస్థలతో పోటీపడి పేరుగాంచిన ప్రింటింగ్ ప్రెస్లు హైదరాబాద్లో ఉన్నాయి. ప్రపంచంలో సరికొత్త టెక్నాలజీ ఏదైనా వచ్చిన కానీ వెంటనే అందింపుచ్చుకొని పోటీ పడి పలు ప్రింటింగ్ ప్రెస్లు పని చేస్తున్నాయి. ముఖ్యంగా నగరంలో లక్డీకపూల్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, గౌలిగూడ, చత్తాబజార్ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రింటింగ్ ప్రెస్లున్నాయి. ఈ ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారే గాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వివిధ ప్రచురణలు సాగుతుంటాయి. అయితే 2017 నుంచి ఎన్నికల నేపథ్యంలో డిజిటల్ ప్రచారం ఊపందుకోవడంతో ప్రింటింగ్ ప్రెస్లపై తీరని దెబ్బపడింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE