ఈ ఏడాది చివరిలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గానూ 95 నుంచి 105 సీట్లలో విజయం సాధించి బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు సహా పలువురు ముఖ్యనాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని, సర్వేలన్నీ బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా 95 నుంచి 105 స్థానాలు గెలవబోతున్నామని, ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు, అపోహలు అక్కరలేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అత్యధిక సీట్లు ఇస్తామని, తాను చెప్పినట్లు చేస్తే ప్రతి ఒక్కరికీ 50 వేల మెజారిటీ గ్యారెంటీ అని కూడా అన్నారు.
గుజరాత్ మోడల్ బోగస్ అని అభివర్ణించిన ఆయన, తెలంగాణ మోడలే దేశానికి అవసరం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో సభలు పెట్టుకుంటే వేలాదిమంది ప్రజలు రావడం సహజమని, అయితే మహారాష్ట్రలోనూ అదే తరహాలో ప్రజలు మనకు బ్రహ్మరథం పడుతున్నారంటే.. అందుకు కారణం మనం ఆచరించి చూపించిన మోడలేనని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంగా ఏర్పడ్డ 9 ఇళ్లలోనే తెలంగాణ సాధించిన ఈ ఘనతను చూసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని, దీనిని మనం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని నాశనం చేశాయని, నాడు జవహర్ లాల్ నెహ్రూ హయాంలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేయడం మినహా ఆ తర్వాత వచ్చిన వారెవ్వరూ దేశానికి చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
కాగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్ 2తో తొమ్మిదేళ్లు పూర్తయి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో.. ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2 నుంచి 21 రోజుల పాటు నిర్వహించుకుందామని, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో చేసుకుందామని సీఎం కేసీఆర్ వివరించారు. ఈ తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకాలు, సాధించిన అభివృద్ధిని ప్రజలకు గుర్తు చేయాల్సిన బాధ్యత పార్టీలోని అందరిమీదా ఉందని పేర్కొన్న ఆయన.. దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు సహా పార్టీ ప్రతినిధులు భాగస్వాములు కావాలని సూచించారు. ఇక ఉత్సవాల సందర్భంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావును స్మరించుకోవాలని, దేశం కష్టకాలంలో ఉన్న సమయంలో అనేక సంస్కరణలను చేపట్టిన దార్శనికుడని కొనియాడారు. అలాగే దేశంలో రెసిడెన్షియల్ స్కూళ్లకు ఆద్యుడు పీవీ అని, సర్వేల్లో తొలి రెసిడెన్షియల్ స్కూల్ను ప్రారంభించారని, ఆ మహనీయుడి స్ఫూర్తితోనే నేడు రాష్ట్రంలో 1,001 గురుకులాలు ఏర్పాటు చేసుకొన్నామని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE