టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రేపటితో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. దీంతో టీడీపీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. లోకేష్ యాత్రకు సంఘీభావంగా ఏపీలోని 175 నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు పాదయాత్రలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ జాతీయ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో.. ‘అడ్డంకులు అధిగమిస్తూ, విశేష ప్రజాదరణతో ముందుకు సాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్రకు అభినందనలు. పాదయాత్ర ఈనెల 15వ తేదీన 100 రోజుల మైలురాయి చేరనుంది. ఈ సందర్భంగా అదే రోజున టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో సంఘీభావంగా పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో 3 వేల మంది పార్టీ శ్రేణులతో 7 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వారి వారి నియోజకవర్గాలలో జరిగే సంఘీభావ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము’ అని ప్రకటనలో పేర్కొంది.
కాగా ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర, రాయలసీమ జిల్లాల మీదుగా.. ప్రస్తుతం శ్రీశైలంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పాదయాత్రకు అనేక ఆటంకాలు ఎదురైనా వాటిన్నంటినీ అధిగమిస్తూ లోకేష్ ముందుకు సాగారు. ఈ క్రమంలో మార్గ మధ్యంలో ఆయా గ్రామాల, పట్టణాల ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. అలాగే పలు సామాజిక వర్గాలు, రైతులు, మహిళలు, యువత.. ఇలా అందరితో లోకేష్ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వారు తన దృష్టికి తెచ్చిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వారికి భరోసా కల్గిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభం నాటినుంచి రోజు రోజుకూ లోకేష్ కు ప్రజల ఆదరణ పెరుగుతోందని, తద్వారా పార్టీ మళ్ళీ ప్రజలకు దగ్గర అవుతోందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక తన పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. నారా లోకేష్ ప్రత్యేక పైలాన్ ను ఆవిష్కరించనున్నట్లు కూడా టీడీపీ వర్గాలు తెలిపాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE