ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. జనవరి 20న అసెంబ్లీలో ఆమోదించిన వికేంద్రీకరణ బిల్లును ఈ రోజు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెట్టబోగా టీడీపీ పార్టీ అడ్డుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ పార్టీ రూల్ 71 మోషన్ కింద నోటీసు ఇచ్చింది. రూల్ 71 తీర్మానం ప్రవేశపెట్టడానికి మండలిలో టీడీపీ పార్టీకి బలముండడంతో, ముందుగా తీర్మానంపై చర్చ జరపాలని ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. అనంతరం మండలి ఛైర్మన్ షరీఫ్ రూల్ 71 నోటీసుపై చర్చించేందుకు అనుమతినిచ్చారు. దీంతో శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లు ఆమోదానికి టీడీపీ తాత్కాలికంగా అడ్డుపడగలిగింది.
ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ, అసెంబ్లీ ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో చర్చ జరగాల్సిందేనని పట్టు పట్టారు. అలాగే రూల్ 71 నోటీసు కింద బిల్లును తిరస్కరించే అధికారం శాసనమండలికి లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యుల నినాదాలతో మండలిలో గందరగోళం నెలకుంది. 10 నిమిషాల పాటు మండలిని వాయిదా వేశారు. సమావేశాలు తిరిగి ప్రారంభమైన తర్వాత రూల్ 71పై చర్చకు చైర్మన్ షరీఫ్ రూలింగ్ ఇచ్చారు. మరోవైపు మండలి చైర్మన్ షరీఫ్ తీరుపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనకున్న విచక్షణాధికారాలను వినియోగించ కూడదని బొత్స సూచించారు. ఈ విమర్శలపై చైర్మన్ షరీఫ్ స్పందిస్తూ తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని, రాజకీయాలు తనకు ఆపాదించవద్దని పేర్కొన్నారు.
[subscribe]