తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. జనవరి 29న బచ్చుల అర్జునుడు గుండెపోటుకు గురవడంతో విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంకు చెందిన బచ్చుల అర్జునుడు టీడీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీకి పలు విభాగాల్లో సేవలు అందించారు. 2000-2005 సమయంలో మచిలీపట్నం మున్సిపల్ ఛైర్మన్ గా, 2014లో కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన గన్నవరం టీడీపీ ఇంఛార్జ్గా ఉన్నారు. 2017లో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా ఏపీ శాసనమండలికి ఎన్నికయ్యారు. బచ్చుల అర్జునుడు మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేస్తూ, “తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మరణం అత్యంత విషాదకరం. గుండెపోటుకు గురై నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన కోలుకుంటారని అనుకున్నాము. అర్జునుడు మృతి పార్టీకి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE