తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు కన్నుమూశారు. ఆయన వయస్సు 102 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం హైదరాబాద్లోని కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. యడ్లపాటి వెంకట్రావు ఎమ్మెల్యేగా, రాజ్యసభ ఎంపీగా, మంత్రిగా, రైతు నాయకుడిగా సహా పలు ఇతర పదవుల ద్వారా సేవలు అందించారు. ఏపీలోని సంగం డెయిరీకి యడ్లపాటి వెంకట్రావు వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్నారు. 1983 నుంచి టీడీపీలో కొనసాగుతున్నారు. యడ్లపాటి వెంకట్రావు మృతిపట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
రాజకీయ కురువృద్ధులు యడ్లపాటి వెంకట్రావు మృతి బాధాకరమని చంద్రబాబు అన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన వెంకట్రావు రాజకీయ జీవితం ఎంతో ఆదర్శ ప్రాయంగా సాగిందని, రాష్ట్ర మంత్రిగా, జడ్పీ చైర్మన్ గా, రాజ్యసభ సభ్యునిగా పని చేసిన యడ్లపాటి, తాను చేపట్టిన పదవులకు వన్నె తెచ్చారని చెప్పారు. “యడ్లపాటి వెంకట్రావు మృతికి సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వెంకట్రావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని టీడీపీ అధినేత పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ