తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో 11 మంది కరోనా బాధితులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు మృతిచెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఏపీ సీఎం జగన్ అన్నారు.
రాష్ట్రంలో కరోనా ఆసుపత్రుల్లో బెడ్లు,ఆక్సిజన్ కొరతపై తీసుకోవాల్సిన చర్యలపై ఈ రోజు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మన చేతుల్లో లేని అంశాలకు బాధ్యత వహించాల్సి వస్తోంది. తమిళనాడు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయానికి రాలేదు. ఆసుపత్రిలో 11 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. నిన్న కూడా 6 ట్యాంకర్లను ఒడిశాకు విమానంలో పంపాం. రవాణా సమయాన్ని ఆదా చేయడానికి ఎయిర్ లిఫ్ట్ చేశాం’’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
విదేశాల్లో ఆక్సిజన్ కొనుగోలు చేసి నౌకల ద్వారా తెప్పిస్తున్నాం. ఆక్సిజన్ కొరత రాకుండా ఇన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం అన్నారు. కరోనాతో కలిసి జీవించాల్సినపరిస్థితుల్లో ఉన్నాం. బాధాకర ఘటనలు కూడా జరుగుతున్నాయి. కలెక్టర్లు అందరూ అప్రమత్తతతో వ్యవహరించాలి, మానవత్వం చూపాలి. కరోనా కారణంగా నెలకొన్న సమస్యలను మానవత్వంతో ఎదుర్కోవాల్సి ఉంది. రాజకీయ కారణాలను దృష్టిలో ఉంచుకొని కోందరు దుష్ప్రచారాలు చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ