ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నటనాసార్వభౌముడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. సీఎం కేసీఆర్ సూచన మేరకు శనివారం తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో హైదరాబాద్ లోని ఆయన అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించింది. ఈ ఉదయం కైకాల సత్యనారాయణ స్వగృహం నుంచి బయలుదేరిన అంతిమయాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే 777 సినిమాలకు పైగా నటించి తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న దిగ్గజ నటుడ్ని కడసారి చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఇక మహాప్రస్థానం వద్ద తొలుత తెలంగాణ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కైకాల కుమారుడు ఆయన చితికి నిప్పంటించారు.
కాగా అనారోగ్య సమస్యలతో శుక్రవారం ఉదయం కైకాల సత్యనారాయణ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ సహా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు కైకాల భౌతికకాయానికి నివాళులర్పించారు. అలాగే చిత్రపరిశ్రమ నుండి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సహా ఎంతోమంది ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు సినీ రంగానికి కైకాల సత్యనారాయణ చేసిన సేవలను స్మరించుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ