ఒకేసారి తొంభైతొమ్మిది మంది అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ – జనసేన కూటమి విడుదల చేసిన తొలి జాబితాతో అభ్యర్థులు ఖుషీగా ఉన్నారు. తొలిజాబితాలోనే పేరున్న వారు ప్రచారం మొదలెట్టేశారు. వాస్తవానికి మెజారిటీ సీట్లకు సంబంధించి అభ్యర్థుల జాబితాలను టీడీపీ, జనసేనలు చాలా రోజుల క్రితమే తయారుచేశాయి. వందకు పైగా సీట్లకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేశాయి. ఈ నెల రెండో వారంలోనే వీటిని విడుదల చేయాలని అనుకున్నా.. బీజేపీ కొత్తగా ఈ కూటమిలోకి రావడంతో వాయిదావేశారు. బీజేపీ నాయకత్వంతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఆ పార్టీకి ఇచ్చే సీట్ల విషయంలో దాదాపు స్పష్టత రావడంతో ఇప్పుడు జాబితా ప్రకటనకు సిద్ధమయ్యారు. ఇవాళ్టి ముహూర్తం దాటితే మళ్లీ రెండు వారాల వరకూ మళ్లీ అంత మంచి ముహూర్తం లేదని పండితులు చెప్పడంతో ఈనెల24న జాబితా విడుదల చేశారు. జాబితా విడుదల టీడీపీలో జోష్ పెంచినప్పటికీ.. జనసేనానిని వివాదాలు చుట్టుముడుతున్నాయి.
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ – జనసేన కూటమి విడుదల చేసినప్పటి నుంచీ జనసేన అధినేత పవన్ కల్యాణ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొత్తులో భాగంగా పవన్ 24 సీట్లకు ఫిక్స్ కావడం చాలా మందికి రుచించడం లేదు. జనసేనకు 24 సీట్లు ఇవ్వడం ఏంటని కాపు ఉద్యమ నేత హరిరామజోగయ్య కూడా ఫైర్ అయ్యారు. ‘పొత్తు ధర్మం సీట్ల కేటాయింపు జరగలేదు. ఒకరు ఇవ్వడం.. మరొకరు దేహీ అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదు. ఆ సీట్లేంటి.. జనసేన పరిస్థితి అంత హీనంగా ఉందా’ అని హరిరామజోగయ్య లాంటి వ్యక్తులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కాపు సామాజిక వర్గం పవన్ తీరుపై కస్సుబుస్సుమంటోంది. కాపు నేతలు ఎన్ని సూచనలు చేసినా.. 50సీట్ల కంటే తగ్గొద్దు అని డిమాండ్లు వినిపించనా.. పవన్ అవేమీ పట్టించుకున్నట్లు కనిపించలేదు.
చంద్రబాబు ఇచ్చినన్ని సీట్లు తీసుకున్నట్లు అనిపిస్తున్నారు. 24 సీట్లకు మించి ఎక్కువ తీసుకురాలేకపోయానని చెప్పిన పవన్.. తన నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు దిక్కుమాలిన లాజిక్ మాట్లాడారు ఒకటి. వీటిని 24 సీట్లలా మాత్రమే చూడొద్దని.. మనం చూడాల్సింది 98శాతం స్ట్రైక్ రేట్ అని.. పోటీ చేయబోయే 3 పార్లమెంట్ సీట్ల కిందకు వచ్చే ఎమ్మెల్యే సీట్లు కూడా లెక్కేసుకుంటే.. మనం మొత్తం 40సీట్లలో పోటీ చేస్తున్నట్లు అంటూ వివరణ ఇచ్చారు. ఇదేం లాజిక్ అంటూ.. పవన్ మాటలు విని పలువురు తలపట్టుకుంటున్నారు.
కాపులను చంద్రబాబు దగ్గర పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టారని. మరో వర్గం నేతలు జనసేనానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకరకంగా వైసీపీకి ప్లస్ అవుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 175 స్థానాల్లో 24 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేస్తుంది. గ్లాస్ పార్టీని తమ సొంత పార్టీకి ఓన్ చేసుకున్న కాపులు.. ఈ 24 స్థానాల్లో మద్దతుగా నిలిచినా, మిగిలిన 151 స్థానాల్లో మాత్రం దూరంగా ఉండే చాన్స్ ఉంది. బీజేపీతో పొత్తు లేకపోతే.. మిగిలిన 151 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే ఉంటారు. సైకిల్ పార్టీ చేసిన అన్యాయానికి భగ్గుమంటున్న కాపులు.. అక్కడ టీడీపీకి మద్దతిచ్చే అవకాశాలు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తనకు సీఎంగా చాన్స్ ఇస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ది చేసి చూపెడతానని పలుమార్లు ప్రకటించిన పవన్.. 24 సీట్లతో సరిపెట్టుకోవడంపై వైసీపీ నేతలు సెటైర్ లు వేస్తున్నారు. 24 సీట్లతో సీఎం ఎలా అవుతారని సోషల్ మీడియాలో పవన్ ను ట్రోల్ చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ