కరోనా శాంపిళ్ల ఫలితాలు 24 గంటల్లో ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి(వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. హోమ్ ఐసోలేషన్ ఉన్న బాధితులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తున్నామన్నారు. మార్చురీలో పనిచేసే ఎఫ్.ఎన్.ఓ., ఎం.ఎన్.వోలకు ఇచ్చే వేతనం రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకూ పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. ఆక్సిజన్ సరఫరా సమయంలో పైపుల్లో ఆటంకాలు తలెత్తకుండా ఉండేలా రూ.30 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కరోనా బాధితుల నుంచి ప్రైవేటు ఆసుప్రతుల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేయకుండా ఉండేలా కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. బెడ్ల కొరత నివారణలో భాగంగా కొవిడ్ కేర్ సెంటర్లను నెలకొల్పుతున్నామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
24 గంటల్లో కరోనా శాంపిళ్ల ఫలితాలు వచ్చేలా చర్యలు:
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం టెస్టింగ్ ల సంఖ్య పెంచామన్నారు. పది రోజుల్లో రోజుకు 30 వేల నుంచి 80 వేలకు పైగా పెంచామన్నారు. 24 గంటల్లో శాంపిళ్ల ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం జిల్లాస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గేలా హోం ఐసోలేషన్ లో ఉండే బాధితుల సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. హోం ఐసోలేషన్ లో ఉండే బాధితులను ప్రతి రోజూ ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. రోగులకు ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు కలుగకుండా ఉండేలా పైపుల మరమ్మతుల నిమిత్తం రూ.30 కోట్లు విడుదల చేయనున్నామన్నారు.
104 కాల్ సెంటర్ల బలోపేతం:
రాష్ట్రంలో 104 కాల్ సెంటర్ సేవలు బలోపేతం చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. కాల్ సెంటర్ లో ఫోన్ వచ్చిన 3 గంటల్లో బెడ్ లుకేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి మాత్రమే ఆసుపత్రుల్లో, తక్కువ స్థాయిలో లక్షణాలున్నవారికి కొవిడ్ కేర్ సెంటర్లలో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనివల్ల ఆసుపత్రుల్లో బెడ్ లకు కొరత రాదన్నారు.
ఫీజుల పెంపునకు కమిటీ నియామకం:
ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వైద్య సేవలకు ఫీజుల పెంపుపై కమిటీని నియమించినట్లు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. పేదలకు ఇబ్బందులు కలుగుకుండా, ప్రైవేటు ఆసుపత్రులకు ఉపశమనం కలిగించేలా ఈ ఫీజులు పెంచబోతున్నామన్నారు. సాధారణ సేవలకు రూ.3,250లు, తీవ్ర అనారోగ్యం పాలైన వారి నుంచి ప్రైవేటు యాజమాన్యాలు గతంలో రూ.10,380ల ఫీజులు వసూలు చేసేలా ప్రభుత్వం ధరలు నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యం పాలైన వారికి అందించే సేవలకు రూ.16 వేల వరకూ పెంచుతున్నామన్నారు. ఈ పెంపుతో రోగులపై భారం పడబోదన్నారు. ఫీజులు పెంచినందున ప్రైవేటు యాజమాన్యాలు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. పేదల పట్ల ప్రైవేటు ఆసుపత్రులు మానవత్వంతో వ్యవహరించాలని కోరారు.
కొవిడ్ కేర్ సెంటర్లు, బెడ్ల సంఖ్య పెంపు:
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కొవిడ్ కేర్ సెంటర్లను రెట్టింపు సంఖ్యలో పెంచబోతున్నట్లు తెలిపారు. ఈ కొవిడ్ కేర్ సెంటర్లలో బెడ్ ల కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్రంంతలో ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లకు కొరత లేదన్నారు. మార్చురీలో పనిచేసే ఎఫ్.ఎన్.ఓ., ఎం.ఎన్.వోలకు ఇచ్చే వేతనం రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకూ పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. కొవిడ్ కాలానికి ఈ వేతన పెంపు వర్తిస్తుందన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 86,035 టెస్టులు చేశామన్నారు. వాటిలో 14,792 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 57 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో వెయ్యి బెడ్లతో ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకొచ్చిందన్నారు. ఈ ఆసుపత్రిలో ఆక్సిజన్ సేవలు కూడా అందిస్తామన్నారు. ఆక్సిజన్ నిల్వల సరాఫరాకు మరిన్ని ట్యాంకర్లు వినియోగించనున్నామన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అసరమైన మేరకు సిబ్బంది రిక్రూట్ చేసుకోవాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ