జూన్ 18వ తేదీ నుంచి జూలై 9వ తేదీ దాకా అమెరికాలో పెద్దఎత్తున శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించనున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అమెరికాలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం జూన్ 18 నుంచి జూలై 9వ వరకు మొత్తం ఎనిమిది నగరాల్లో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించనున్నామని తెలిపారు. తిరుమలలో శనివారం ఉదయం టీటీడీ ఈవో ధర్మారెడ్డి తో కలసి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. గత రెండున్నరేళ్లుగా కరోనా వల్ల ఇతర దేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశం మేరకు అమెరికాలోని భక్తుల కోసం టీటీడీ శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రవాసభారతీయుల అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కోలో, జూన్ 19న సియాటెల్ లో, జూన్ 25న డల్లాస్ లో, జూన్ 26న సెయింట్ లూయిస్ లో, జూన్ 30న చికాగో నగరాల్లో స్వామివారి కళ్యాణాలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే జూలై 2వ తేదీన న్యూ ఆర్లిన్ లో, జూలై 3న వాషింగ్టన్ డీసీలో, జూలై 9వ తేదీన అట్లాంటా నగరాల్లో శ్రీవారి కళ్యాణాలు జరుగుతాయన్నారు. భక్తులు ఉచితంగా కళ్యాణంలో పాల్గొనవచ్చని అన్నారు. ఇతర దేశాల నుంచి కూడా తమ ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని విజ్ఞప్తులు వచ్చాయని వాటిని కూడా పరిశీలిస్తామని, ప్రపంచం వ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సిద్ధంగా ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY