తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయ్ పేట్ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో స్పీకర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో వాడవాడలా పర్యటించి పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పరిసరాల పరిశుభ్రతను స్పీకర్, మంత్రులు పరిశీలించారు. మొక్కలు కూడా నాటారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహణపై గ్రామ సర్పంచ్, కార్యదర్శి, సిబ్బందిని అభినందించిన మంత్రి ఎర్రబెల్లి, అనంతరం జరిగిన గ్రామ సభలో అంశాల వారీగా గ్రామ పరిస్థితులను సమీక్షించారు. గ్రామంలో ట్రాక్టర్ ఎన్ని గంటలకు వస్తున్నది?, సమయానికి చెత్త సేకరణ సక్రమంగా జరుగుతున్నదా?, డంపింగ్ యార్డు వినియోగిస్తున్నారా?, చెత్తను ఎరువుగా తయారు చేస్తున్నారా?, ట్రాక్టర్, చెత్త ద్వారా ఎంత ఆదాయం వస్తున్నది? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పల్లె ప్రగతి ద్వారా తెలంగాణ గ్రామాలు దేశానికి ఆదర్శంగా తయారయ్యాయి:
అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, పల్లె ప్రగతి ద్వారా తెలంగాణ గ్రామాలు దేశానికి ఆదర్శంగా తయారయ్యాయని, గ్రామాల్లో అన్ని సదుపాయాలు సమకురుతున్నాయని అన్నారు. ఒకప్పటి పట్టణ, నగర వలస తగ్గిపోయి, ఇప్పుడు పల్లెలకు వలస మొదలైంది. గ్రామాలు సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. పారిశుద్ధ్యం పెరిగి, ఆరోగ్యం పెరిగి గ్రామాలు ఆయుఆరోగ్యాలకు అడ్రెస్స్ గా మారాయి. ఒక గ్రామానికి పచ్చదనం పెంచడానికి నర్సరీలు, డంపింగ్ యార్డులు, చెత్తను వేరు చేసే పద్ధతి, అంతిమ సంస్కారాలకు వైకుంఠ ధామాలు వంటివి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం. రైతు వేదికలు, కల్లాలు, రైతులకు ఎదురు పెట్టుబడి, రైతు బీమా, పెన్షన్లు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఇలా ఇన్ని సదుపాయాలు ఎప్పుడూ జరగలేదు. సీఎం కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైంది అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమం సాధించిన ఫలితాలు ఇక్కడి గల్లీల నుంచి ఢిల్లీని తాకాయి:
” రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన బకాయిలు నయా పైసా లేకుండా ఇచ్చింది. కేంద్ర నిధికి సమానంగా ప్రతి ఏటా 230 కోట్ల నిధులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. కేంద్రం నుంచి ఇంకా రూ.1450 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. పేదల ఇంటికి మేనమామగా సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కేసీఆర్ కిట్లు ఇస్తున్నాం. సొంత జాగాల్లో ఇండ్లు కట్టుకునే అవకాశం త్వరలోనే వస్తుంది. బాన్సువాడ ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి అనేక గ్రామాలు ఆదర్శ గ్రామాలు అయ్యాయి. పల్లె ప్రగతి కార్యక్రమం సాధించిన ఫలితాలు ఇక్కడి గల్లీల నుంచి ఢిల్లీని తాకాయి. ఇదంతా సీఎం కేసీఆర్ చొరవ, అధికారుల శ్రమ, ప్రజల భాగస్వామ్యం తోనే సాధ్యం అయింది. ఈ ప్రగతి కొనసాగాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లు కావాల్సిన నిధులు ఇస్తున్నారు. ఈ నిధులన్నింటితోనే గ్రామాల అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది” అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY