వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తోన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఊహకు కూడా అందని రీతిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎట్టిపరిస్థితిలోనైనా రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున సిట్టింగ్లను మార్చేశారు. ఏడు విడతల్లో పలు స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించేశారు. త్వరలోనే మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఓవైపు రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకుంటూనే.. మరోవైపు విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ జగన్ హీటెక్కిస్తున్నారు.
తాజాగా జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త కాలేజీలపై ఏర్పాటుకు పచ్చ జెండా ఊపారు. ప్రతి మండలంలో రెండేసి జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయనుండగా.. అందులో ఓ కాలేజీని బాలికలకు కేటాయించనున్నారు. మరో కాలేజీలో బాలురు, బాలికలు కలిపి ఉండనున్నారు. విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేందుకు ఇబ్బందులు పడుతుండడంతో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మండలాల్లో కాలేజీలను ఏర్పాటు చేయడం ద్వారా ఇకపై విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం పేర్కొంది.
నూతనంగా నిర్మించబోయే కాలేజీలకు జగన్.. మార్చి 3లోగా భూమి పూజ చేయనున్నారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం 685 మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో కొత్తగా 1,370 జూనియర్ కాలేజీలను అధునాతన వసతులతో నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆ కాలేజీల నిర్మాణానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు భూములను కూడా ఎంపిక చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 685 మండలాల్లో కేవలం 118 మండలాల్లో మాత్రమే జూనియర్ కాలేజీలు ఉన్నాయి.
అయితే సరిగ్గా ఎన్నికల ముందు జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దశాబ్దాల కాలంగా కీలక డిమాండ్గా ఉన్న కాలేజీల ఏర్పాటుపై జగన్ తీసుకున్న నిర్ణయం.. వచ్చే ఎన్నికల్లో ఈ నిర్ణయం వైసీపీకి మేలు చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE