ఉక్రెయిన్ దేశంలోని తెలుగు విద్యార్థులందరూ క్షేమంగానే ఉన్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈరోజు ఉదయం ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించి దాడులు చేస్తున్న నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఉన్నత చదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థుల బాగోగులను ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం సురేష్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తోందని.. అయితే, ప్రస్తుతం ఉక్రెయిన్లో విమాన సర్వీసులు రద్దయ్యాయని మంత్రి ఆదిమూలపు తెలిపారు.
ఉక్రెయిన్ లోని విద్యార్థుల సహాయం కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో ఉన్న మొత్తం ఆంధ్రా విద్యార్థుల సంఖ్య గురించి మంత్రి సురేష్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారి భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని భరోసానిచ్చారు. ఒకవేళ ఎవరైనా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉక్రెయిన్లో ఏదైనా సమస్య ఎదుర్కొన్నట్లయితే.. వారు వెంటనే విద్యా శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. అలాగే, వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం తెలియజేయాలని చెప్పారు. దీనివలన ఆయా శాఖల ఉన్నతాధికారుల సహాయంతో వారికి త్వరితగతిన సహాయం చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ