ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో బుధవారం కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బృందం భేటీ అయింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ తో జరిగిన భేటీలో పాల్గొన్న వారిలో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సీఈఓ, సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్, కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.సునీల్, నోడల్ ఆఫీసర్ అజయ్కరన్ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయం, రైతు సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనతో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు, అలాంటి రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ఫసల్ బీమా యోజనలో చక్కటి మోడల్ను పొందుపరచాలని సీఎం కోరారు. ఈ మోడల్ను ఖరారు చేయగానే రాష్ట్రంలో కూడా అమలుకు కేంద్రంతో కలిసి భాగస్వామ్యం అవుతామని సీఎం తెలిపారు.
మరోవైపు వ్యవసాయం, రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ఏపీ మార్గదర్శకంగా నిలిచిందని కేంద్రబృందం ప్రశంసించింది. ముందుగా గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, అక్కడ నుంచి వణుకూరులోని రైతు భరోసా కేంద్రం, కంకిపాడులో ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్ను కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి బృందం సందర్శించింది. అనంతరం తమ పర్యటన అనుభవాలను కేంద్ర బృందం సీఎంతో పంచుకుంది. వ్యవసాయ రంగం, రైతు సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా ప్రశంసించారు. ఆర్బీకేల వ్యవస్థను కొనియాడంతో పాటుగా, అగ్రిల్యాబ్స్ ఏర్పాటు రైతులకు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు.
అగ్రిల్యాబ్స్లో ముందస్తుగా నిర్వహిస్తున్న తనిఖీల్లో విత్తనాలు, ఎరువుల్లో కల్తీ ఉన్నట్టుగా నిర్ధారణ అయితే ఆ సమాచారాన్ని తమకు కూడా ఇవ్వాలన్న ఈ సందర్భంగా అహూజా కోరారు. తద్వారా దేశంలో ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను, రైతులను హెచ్చరించడానికి, కల్తీల బారినుంచి రైతులను కాపాడేందుకు అవకాశం ఉంటుందని అహూజా పేర్కొన్నారు. పొలంబడి పేరుతో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు,ఈ-క్రాపింగ్, కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు, విద్యా, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర బృందం ప్రశంసించింది. ఈ సందర్భంగా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ధరల స్థిరీకరణనిధి ఇలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY