సుమారు 700 ఏళ్ళ తర్వాత పూర్వీకుల పురిటిగడ్డ ఓరుగల్లులో అడుగు పెట్టాడు కాకతీయ సామ్రాజ్యపు వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్. ఈ సందర్భంగా కమల్ చంద్ర భంజ్ దేవ్కు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నరేందర్ తదితరులు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆయన భద్రకాళీ అమ్మవారి ఆలయాకి చేరుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ‘కాకతీయ వైభవ సప్తాహం’ ఉత్సావాలను కమల్ చంద్ర భంజ్ దేవ్ ప్రారంభించారు. ఈ క్రమంలో తమ పూర్వపు రాజవంశ వారసుడిని చూసేందుకు ఓరుగల్లు వాసులు భారీగా తరలి వచ్చారు. కాగా భంజ్ దేవ్ కాకతీయుల 22వ తరం వారసుడు.
కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు మరియు భావి తరాలకు వారి గొప్పతనాన్ని తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్తభుత్వం ప్రకటించింది. ఏడురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో కాకతీయుల వైభవం, వారు సాధించిన విజయాలు, వారి సామ్రాజ్య గొప్పతనం తెలిపేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వారం రోజులూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే జూలై 8 నుంచి 12 వరకు ప్రతిరోజు హనుమకొండలోని వేణుమాధవ్ ఆడిటోరియంలో నాటకోత్సవాలు కూడా జరుపనున్నారు. ఇక చివరిరోజున రామప్పలో కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాల ముగింపు సభ ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుతం కాకతీయుల వారసులు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో నివసిస్తున్నారు. అయితే వరంగల్లో ఏడు రోజుల పాటు నిర్వహిస్తున్న కాకతీయ వారోత్సవాలకు హాజరుకావాలని తెలంగాణ ప్రభుత్వం ప్రసిద్ధ కాకతీయ వంశానికి చెందిన బస్తర్ రాజు కమల్ చంద్ర భంజ్ను ఆహ్వానించింది. ఈ మేరకు గతవారం ‘కాకతీయ వైభవ సప్తాహం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భంజ్ దేవ్ ను ఆహ్వానించేందుకు ప్రభుత్వ చీఫ్విప్ వినయ్ భాస్కర్, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మరియు రీసెర్చ్ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ (టార్చ్) కార్యదర్శి అరవింద్ ఆర్య పాకిడే ఛత్తీస్గఢ్లోని రాజకుటుంబాన్ని కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ